TTD Chairman : తిరుమల – తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు (TTD Chairman), అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శనివారం పరిశీలించారు.
భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు . అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని అభినందించారు.
TTD Chairman Visit
2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు . ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని, కొత్తగా నిర్మించిన పీఏసీ–5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .
రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు బీఆర్ నాయుడు (TTD Chairman). అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పీఏసీ భవనంలో అనేక ఆధునిక మార్పులు చేశామని పేర్కొన్నారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశామన్నారు. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈలు వేణు గోపాల్, శ్రీనివాస రావు, సుధాకర్, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, సోమన్నారాయణ, డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : CM Chandrababu Interesting Comments : సాగు బాగుంటేనే రాష్ట్రాభివృద్ది : సీఎం
