తిరుపతి : టిటిడిలో సుదీర్ఘ కాలం సేవలు అందించి పదవీ విరమణ పొందిన వారికి రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. టిటిడిలో వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన 122 మంది ఉద్యోగులకు సామూహిక సన్మానం కార్యక్రమాన్ని మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముందుగా టీటీడీ ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగులు పదవి విరమణ అయ్యాక సన్మానం చేసే కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలా లేక శాఖల వారీగా చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివిధ శాఖల్లో, పలు హోదాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ అయ్యాక వారిని గౌరవించి, వారికి అందే ఫలాలను అదే రోజు వారి ఖాతాల్లో జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజూ సరాసరి 75 వేల పైచిలుకు భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులను ఈవో అభినందించారు.
ఈ సందర్భంగా జేఈవో డా.ఎ.శరత్ మాట్లాడుతూ జూన్ 30న 122 మంది టిటిడి ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నారని, వారిని సమిష్టిగా పండుగ వాతావరణంలో సన్మానించాలని టిటిడి ఈవో ఆలోచనలు మేరకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. టిటిడిలో పదవి విరమణ పొందిన వారిని సన్మానించడం గర్వంగా ఉందన్నారు. తొలిసారి సామూహిక సన్మానం కార్యక్రమాన్ని చేపట్టాలని ఈవో సూచించారని గుర్తు చేశారు. పరిమిత సమయంలో టిటిడి మానవ వనరులు శాఖ, సంక్షేమం శాఖ ఘనంగా ఏర్పాట్లు చేయడంపై నిర్వాహకులను జేఈవో అభినందించారు.
ఈ సందర్భంగా సివిఎస్వో కే వి మురళీకృష్ణ మాట్లాడుతూ, పదవి విరమణ పొందిన వారిని ఒకే వేదికపై సన్మానించే కార్యక్రమాన్ని చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన 122 మందికి ఒక్కొక్కరికి శ్రీవారి లడ్డూ, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవికె, అక్షింతలు, తీర్థం, శాలువా ఇచ్చి సత్కరించారు. అనంతరం ఈవోను టీటీడీ ఉద్యోగులు సత్కరించారు. అంతకు ముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. .పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ ఇళ్లకు చేర్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం శాఖాధిపతి డా. కృష్ణవేణి వ్యవహరించారు.
