విజయవాడ : విజయవాడ నుండి విమాన అనుసంధానతను బలోపేతం చేయడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు పలు చర్యలను ప్రకటించారు. వీటిలో ఆగస్టు 13 నుండి వారణాసి మీదుగా విజయవాడ-కోల్కతా మధ్య కొత్త విమాన సర్వీసును ప్రారంభించడం , ప్రయాణికుల విదేశీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టడం వంటివి ఉన్నాయి. విజయవాడ నుండి ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు , హైదరాబాద్లకు అదనపు విమాన సర్వీసులు ప్రారంభించామని ఆయన తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ ప్రకటనలు చేశారు.
విజయవాడ మీదుగా సాఫీగా ప్రయాణాన్ని (ట్రాన్సిట్) అనుమతించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఇబ్బందులను తొలగించడంలో ఇది సహాయ పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతలో భాగంగానే విజయవాడలో ఈ సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఏటీసీ ప్రారంభోత్సవం తర్వాత రామ్ మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు; ఇందులో ఎంపీలు వల్లభనేని బాలశౌరి , కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. దసరా నాటికి కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.

















