హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం , ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణను దేశానికే రవాణా, ఆర్థిక హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం అని చెప్పారు. ఈరోజు సచివాలయంలో హై స్పీడ్ రైల్ కారిడార్ల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. హైదరాబాద్ – ముంబై హై స్పీడ్ కారిడార్ ద్వారా కేవలం 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే పూర్తయిందని స్పష్టం చేశారు.
అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా చెన్నై, బెంగళూరు నగరాలకు హై స్పీడ్ రైలు కనెక్టివిటీ కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం అని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఈ ఎకనామిక్ గ్రోత్ కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం అన్నారు. మరోవైపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించాలని నిర్ణయించాం అని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.















