తమిళనాడు : తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది. మే నెలలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసందర్బంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ వీడియో సందేశం ఇచ్చారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టాలిన్ కరుణానిధి కంటే ప్రమాదకారి అని కొందరు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. నన్ను కరుణానిధితో ఎప్పటికీ పోల్చలేరని ఈ సందర్బంగా అన్నారు సీఎం.
ఆయన్ని నా తండ్రి అని పిలవడం కంటే, నేను ఎల్లప్పుడూ ఆయన్ని నా నాయకుడిగానే సంబోధించానని అన్నారు ఎంకే స్టాలిన్. అటువంటి నాయకుడి (కరుణానిధి) కంటే నేను ఎక్కువ ప్రమాదకారిని అని వారు అన్నప్పుడు, నా మనసులో ఒక విషయం మెదులుతోందన్నారు. తమిళనాడుకు ద్రోహం చేయాలని, మన పురోగతికి అడ్డు పడాలని చూసేవారికి నేను ఎల్లప్పుడూ ప్రమాదకారిగానే ఉంటానని, కనిపించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఒకవేళ నా నాయకుడి కంటే నేను ఒక అడుగు ముందే ఉన్నానని భావిస్తే, నేను దానిని గర్వంగా స్వీకరిస్తానని ప్రకటించారు. ఎందుకంటే ఈ స్ఫూర్తి తమిళుల రక్తంలోనే ప్రవహిస్తుందని అన్నారు సీఎం ఎంకే స్టాలిన్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో డీఎంకే, కాంగ్రెస్ ఇండియా కూటమి , అన్నాడీఎంకే ఎన్డీయే కూటమితో పాటు ప్రముఖ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించు కోకున్నాయి. ఈ తరుణంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ చోటు చేసుకుంది.















