మత్స్య కారుల సేవలో ఉంటాం అండగా నిలుస్తాం

భ‌రోసా క‌ల్పించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

నెల్లూరు జిల్లా : దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది కొనసాగాలంటే… మత్స్య కారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల‌న్నారు… వారికి అండగా నిలవాలి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంద‌ని చెప్పారు. మత్స్య కారులకు మేం అండగా ఉంటాం అని భ‌రోసా ఇచ్చారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు లీటరుకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం అని తెలిపారు. 2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడిని మత్స్య కార బోట్లకు అందించాం అన్నారు. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంద‌ని చెప్పారు. మత్స్య కారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం అన్నారు. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారుల కోసం శాంక్షన్ చేస్తాం. 60 శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తామ‌ని శుభ‌వార్త చెప్పారు సీఎం. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ లభ్యం అవుతాయో అనే సమాచారాన్ని కూడా ఇస్తున్నాం అన్నారు. మెకనైజ్డ్ బోట్లతో సులువుగా చేపల వేట చేసేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆక్వా కల్చర్ కు అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్ కు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు. మన రాష్ట్రానికి ఏ రంగంలో ఆదాయం వస్తుందో దానిపై శ్రద్ధ పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సేవలో పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో మత్స్య కారుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వారిని ఆదుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ మత్స్య కార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం అన్నారు. 2014-19 మధ్యలోనూ చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల వరకూ ఆర్ధిక సాయం చేసి టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు.

Exit mobile version