TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ (TTD) ఈవో అనిల్కుమార్ సింఘాల్, సివిఎస్ఓ మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి తిరుమలకు తరలివచ్చారు. భక్తులందరికీ శ్రీవారి 16 వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం లభించిందని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు వెల్లడించారు.
TTD – భక్తుల సంఖ్య & ఆదాయం:
ఈ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిది రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.25.12 కోట్ల ఆదాయం లభించింది. అన్నప్రసాదాన్ని 26 లక్షల మందికి పైగా భక్తులు స్వీకరించగా, 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా 28 లక్షలకు పైగా లడ్డూలను విక్రయించారు.
ఆర్టీసీ సౌకర్యం:
బ్రహ్మోత్సవాల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. తిరుపతి నుంచి తిరుమలకు 4.40 లక్షల మంది భక్తులు, తిరుమల నుంచి తిరుపతికి 5.22 లక్షల మంది భక్తులు బస్సులలో ప్రయాణించారు.
విరాళం:
స్వామివారికి ఖమ్మం జిల్లా చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అంకిత్ రూ.30 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు చెక్కును అందజేశారు.
Also Read : Online Gaming Rules Shocking : ఆన్లైన్ గేమింగ్ పై కీలక నియమాలను విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ
