విజయవాడ : ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం లేదని తెలిపారు. ప్రధాన ఆలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర మతపరమైన సిబ్బంది నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జోనల్ విధానాన్ని అనుసరించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అసెంబ్లీకి తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టులలో 172 పోస్టులు రాయలసీమలోని ప్రధాన ఆలయాలకు (శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి , కనిపాకం వంటివి) చెందినవని ఆయన పేర్కొన్నారు.
అభ్యర్థుల ప్రాంతంతో సంబంధం లేకుండా, వేదాలు , ఆగమ శాస్త్రాలపై పరిజ్ఞానం, అర్హతలు మరియు ప్రతిభ ఆధారంగా ఈ నియామకాలు జరిగాయని చెప్పారు 1,400 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా రాయలసీమ నుండి 1,431 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరిలో 172 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. పారదర్శకతను నిర్ధారించడానికి ఈ ప్రక్రియ అంతా వీడియో రికార్డ్ చేయబడిందన్నారు . జోన్-IV పరిధిలో మొత్తం 440 పోస్టులు ఉండగా, అందులో 245 భర్తీ అయ్యాయని, 147 ఖాళీగా ఉన్నాయని మంత్రి ఆనం తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ సేవలు నిర్వహించేందుకు అర్హులైన సిబ్బందిని నియమిస్తూ, నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేస్తుందని ఆయన చెప్పారు.

















