ముంబై : ప్రముఖ నటి సంజనా గిర్లానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఆమె సామాజిక మాధ్యమం ద్వారా ఇటీవలే ముగిసిన అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం మరిచి పోలేని అనుభూతిని మిగిల్చేలా చేసిందని పేర్కొంది. నాతో పాటు నా కుటుంబం , స్నేహితులు సైతం అందించిన సహకారం మరిచి పోలేనని తెలిపింది సంజనా గిర్లానీ. ఈ సందర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్ల క్రితం జీవితాన్ని మార్చేసిన ఒక ఎదురు దెబ్బను అధిగమించడం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ బిగ్ బాస్ షో తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతో పాటు మరింత బలాన్ని తిరిగి పొందడంలో సహాయ పడిందని చెప్పింది సంజనా గిర్లానీ.
బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్ట్గా నిలవడం కూడా మరింత ఆనందం కలిగించేలా చేసిందన్నారు.
ఈ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయని తెలిపింది. ఇది తన జీవితంలో లోతైన పరివర్తన తీసుకు వచ్చిందని పేర్కొంది. సంజన తన అభిమానులకు, కుటుంబానికి , బిగ్ బాస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది, ఈ షో తన కెరీర్లో ఒక కొత్త దశను ప్రారంభించడానికి తనను ప్రేరేపించిందని చెప్పింది. ఆమె తెలుగు సినిమాపై తన పునరుద్ధరించిన దృష్టిని కూడా వెల్లడించింది, హోస్ట్ అక్కినేని నాగార్జునపై తన అభిమానాన్ని పంచుకుంది, ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ సినిమాలోని ఒక డైలాగ్ను తిరిగి చెప్పి అభిమానులను ఆనంద పరిచింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విజనరీ వోవ్స్కు ధన్యవాదాలు తెలిపింది.
