హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సామాన్యంగా ఎవరినీ ప్రశంసించే ప్రయత్నం చేయరు. కానీ తాజాగా తను ఎన్నో సినిమాలు తీసిన బాలీవుడ్ పై కితాబు ఇచ్చారు. ప్రత్యేకించి హిందీ చలన చిత్ర పరిశ్రమలో జవాబుదారీతనం పెరిగిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. నిర్మాణ వ్యయాలను అదుపులో ఉంచినందుకు చిత్ర పరిశ్రమను ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి తర్వాతే బాలీవుడ్ క్రమశిక్షణను అలవర్చుకుందని పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. వరుస బాక్సాఫీస్ వైఫల్యాలు హిందీ సినిమాను మార్పుకు గురిచేశాయని చెప్పారు. చాలా సంవత్సరాలుగా దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయించాయని తెలిపారు. మనుగడ కోసం బాలీవుడ్ ఒక కార్పొరేట్ నమూనాను అవలంబించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్జీవీ.
ఇప్పుడు నిర్మాణం ప్రారంభం కాకముందే బడ్జెట్లు ఖరారు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఖర్చుల పెరుగుదలకు దర్శకులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వ్యవస్థ కఠినమైన జవాబుదారీతనం , ఆర్థిక నియంత్రణను సృష్టిస్తుందని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు పబ్లిక్గా ట్రేడ్ చేయబడతాయి కాబట్టి, ఒకే ఒక్క వైఫల్యం వ్యాపారాలను నాశనం చేయడం అరుదు అని అన్నారు. ఆర్థిక నష్టాన్ని కంపెనీ అంతటా పంచుకుంటారని తెలిపారు. వర్మ ఈ నిర్మాణాన్ని తెలుగు సినిమాతో పోల్చారు. తెలుగు చిత్రాలు నిర్మాత-ఆధారిత నమూనాను అనుసరిస్తాయని చెప్పారు. వైఫల్యాల పూర్తి ఆర్థిక భారాన్ని స్వతంత్ర నిర్మాతలు భరిస్తారని అన్నారు. అదనపు ఖర్చుల కోసం దర్శకులు గానీ, ప్రధాన నటులు గానీ ఎటువంటి జరిమానాలను ఎదుర్కోరని చెప్పారు దర్శకుడు.
