హైదరాబాద్ : ఆగమేఘాల మీద ప్రభుత్వానికి సంబంధించిన భూములను తక్కువ ధరకు తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా జీవో తీసుకు వచ్చారని బాంబు పేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంతే కాదు నోటీసులు కూడా పంపించింది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) విషయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎటువంటి అధ్యయనం చేయకుండా 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా ఎలా మారుస్తారంటూ ప్రశ్నించింది. సర్కార్ ను నిలదీసింది. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు కే వివేక్ రెడ్డి, కే ప్రతీక్ రెడ్డి చేసిన వాదనలను విన్నది. ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా జీవో ఉందని వాపోయారు. ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) చేయకుండానే కొన్ని వేల ఎకరాల్లో ఉన్న పారిశ్రామిక భూములను నివాస స్థలాలుగా (రెసిడెన్షియల్ జోన్) మార్చడం దారుణమన్నారు.
