హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కత్తి వెంకట స్వామి. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీలో పలు ప్రశ్నలు లేవనెత్తాయి. సీఎంగా రేవంత్ రెడ్డి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పార్టీ బతికే పరిస్థితి లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. అసలైన పార్టీ కార్యకర్తలు, నేతలకు గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. పూర్తిగా పాలన గాడి తప్పిందని, టీడీపీకి చెందిన నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం సీరియస్ కాగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి కత్తి వెంకటస్వామికి షాక్ ఇచ్చారు. ఆయనకు పార్టీ రూల్స్ ను అతిక్రమించారంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
వివరణ ఇవ్వాలని లేక పోతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వెంకటస్వామి ఓ టీవీ డిబేట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల రాష్ట్రానికి మేలు జరగక పోగా తీవ్ర నష్టం జరుగుతోందని, పార్టీ పెద్దలు, హైకమాండ్ ఇలాగే వదిలి వేస్తే పార్టీ మనుగడ సాధించడం ఇక కష్టమన్నారు కత్తి వెంకట స్వామి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకే లేదని వ్యాఖ్యానించారు.
