హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొననుండగా, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 2023లో అధికారం కోల్పోయినప్పటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కేవలం తన ఫామ్హౌస్కే పరిమితమయ్యారని అసెంబ్లీకి , బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని మొదటి 1,000 రోజులు , గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సవాల్ విసిరారు.
ఆయన పిలుపు మేరకు అసెంబ్లీకి హాజరు కావడం లేదన్న కారణంతో ప్రతిపక్ష నాయకుడి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో, గత 1,000 రోజుల్లో కేసీఆర్ జీతం కోసం రూ. 1.24 కోట్లు, అలాగే ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు , ఇతర సౌకర్యాల కోసం రూ. 21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇటీవల అధికారంలో 1,000 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ‘ఛార్జ్షీట్’ విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ప్రభుత్వం అనేక కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని , ప్రధాన రంగాలలో పాలన పరంగా కూడా వెనుకబడిందని ఆరోపించారు.
ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు , ఇతర వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద బకాయిలు, విద్యార్థులకు రూ. 5 లక్షల ‘భరోసా’ కార్డు, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ, పాలిటెక్నిక్ కళాశాలలను ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’లో విలీనం చేయడం వంటి నెరవేరని ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బిఆర్ఎస్ యోచిస్తోందని రామారావు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలతో పాటు, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో పెద్ద ఎత్తున భూములను చేర్చడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బిజెపి సిద్ధమవుతోంది.


















