తాడేపల్లి గూడెం : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై భగ్గుమన్నారు. డీఎస్సీ 2025 నియామకాలలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. సోషల్ మీడియాపై డిజిటల్ సెన్సార్షిప్కు పాల్పడుతోందని టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. హలో ఇండియా అంటూ ప్రారంభించిన ఒక ఘాటైన బహిరంగ ప్రకటనలో పారదర్శకతను అంగీకరించడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని, డిజిటల్ సెన్సార్షిప్ ద్వారా భిన్నాభిప్రాయాలను అణచి వేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను జగన్ ప్రశ్నించారు.
అవకతవకలకు సంబంధించిన పెరుగుతున్న ఆధారాలను ఎత్తి చూపారు. తప్పనిసరి అయిన డీఎస్సీ పరీక్ష రాయకుండా లేదా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించకుండానే ఉపాధ్యాయులను నియమించారని జగన్ పేర్కొన్నారు. క్రీడా కోటాలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం, ఆ తర్వాత వాటిని రద్దు చేయడం వంటి అనుమానాస్పద పరిపాలనా చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఆ ఉత్తర్వుల లబ్ధిదారులు మాత్రం సర్వీసులోనే కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను సవాలు చేస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు ఆయన సవాల్ విసిరారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మెటా ప్లాట్ఫామ్లలో (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సోషల్ మీడియా పోస్టులు, న్యూస్ హ్యాండిల్స్ కార్యకర్తల ఖాతాలను బ్లాక్ చేయడం, పరిమితం చేయడం , తొలగించడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. సాక్షి టీవీ, సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్ వంటి ప్రముఖ డిజిటల్ హ్యాండిల్స్తో పాటు పలు వ్యక్తిగత ఖాతాలు కూడా “చట్టపరమైన అవసరాలు” అనే ముసుగులో భౌగోళిక ఆంక్షలను ఎదుర్కొన్నాయని హైలైట్ చేశారు.


















