ముంబై : గణేష్ చతుర్థి ఉత్సవాల్లో డీజేల వినియోగాన్ని నిషేధించాలన్న శ్రీ బాపత్ డిమాండ్కు ప్రజల మద్దతు లభించిందని శివసేన (నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. నగరంలో అధిక శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పూణేకు చెందిన పర్యావరణ కార్యకర్త విద్యానంద్ బాపత్పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో డీజేల వినియోగంపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. బహిరంగ ఉత్సవాల్లో అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థల వినియోగంపై ఈ ఘటన రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రజారోగ్యంపై వీటి దుష్ప్రభావాలను ప్రస్తావిస్తూ శివసేన యూబీటీ పార్టీ వీటిపై పూర్తి నిషేధాన్ని డిమాండ్ చేసింది. బహిరంగ చర్చల ద్వారా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించడం కంటే ఈ అంశంపై స్వయంగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ సంజయ్ రౌత్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు.
కాగా సీఎం ఫడ్నవీస్ డీజేలపై నిషేధాన్ని సమర్థించడంతో పాటు ప్రజలు సంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే చర్చలు, సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం సాధించాలని కూడా ఆయన సూచించారు. గణేష్ ఉత్సవాల ఊరేగింపుల్లో అధిక శబ్దం చేసే డీజేల వల్ల కలిగే ధ్వని కాలుష్యానికి వ్యతిరేకంగా శ్రీ బాపత్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పూణేలోని నారాయణ్ పేట్ ప్రాంతానికి చెందిన ఆయన, గణేశోత్సవాల సమయంలో డీజేలు, పెద్ద శబ్దంతో కూడిన సంగీతం వినియోగంపై జరుగుతున్న చర్చలో ఇటీవల ప్రముఖ గొంతుకగా మారారు. ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, శబ్ద కాలుష్య సమస్యను ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చవచ్చని ఫడ్నవీస్ భావిస్తున్నట్లు కనిపిస్తోందని రౌత్ అన్నారు.
డీజేల వినియోగంపై ప్రభుత్వం ఒక్క రోజులోనే నిర్ణయం తీసుకోవచ్చని కానీ విస్తృత సంప్రదింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. బహిరంగ వేడుకల్లో డీజేల ద్వారా వచ్చే శబ్దం చాలా తీవ్రంగా ఉంటోందని, దీనివల్ల ప్రకంపనలు ఏర్పడి స్థానికులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రౌత్ పేర్కొన్నారు. నాగ్పూర్లో డీజేలఐ పోలీసులు విధించిన ఆంక్షలను ప్రస్తావించారు. ముంబైలో కూడా అధిక శబ్దంపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వేర్వేరు నియమాలు ఎందుకు వర్తింప జేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
















