RBI : సామాన్యులకు ఊరట కలిగించే పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు మరోసారి రెపో రేటుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్, జీఎస్టీ తగ్గింపు, ఈఎంఐలు తగ్గేలా వడ్డీ రేట్ల కోతలు చేసిన నేపథ్యంలో, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్ల (BPS) రెపో రేటు తగ్గింపుపై చర్చ జరుగనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
RBI – ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు
ఈ రేట్ కట్ సైకిల్లో ఆర్బీఐ ఇప్పటికే మూడు సార్లు రెపో రేటును తగ్గించింది.
- ఫిబ్రవరి 2025లో 25 బీపీఎస్
- ఏప్రిల్లో 25 బీపీఎస్
- జూన్లో 50 బీపీఎస్ తగ్గించగా,
- ఆగస్టులో 5.5% వద్ద స్థిరంగా ఉంచింది.
ఎస్బీఐ రిపోర్ట్ అంచనా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్లో రెపో రేటు తగ్గించకపోతే అది ఒక రకమైన పాలసీ తప్పిదంగా (Type-2 Error) పరిగణించబడుతుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున ఇప్పుడు 25 బీపీఎస్ కోత అవసరమని రిపోర్ట్ పేర్కొంది.
ద్రవ్యోల్బణం పరిస్థితి
ఎస్బీఐ అంచనాల ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుంది. ప్రస్తుతం సీపీఐ ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉండగా, జీఎస్టీ రేట్ల రీస్ట్రక్చరింగ్ ప్రభావంతో అక్టోబర్లో ఇది 1.1%కు పడిపోవచ్చని అంచనా. ఇది 2004 తర్వాత అతి తక్కువ స్థాయి కానుంది.
Also Read : Today Gold Price : మళ్లీ పెరిగిన పసిడి ధరలు



















