న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసేలా చేసింది పోలవరం ప్రాజెక్టు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సర్కార్ బారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ దావాను పరిశీలించేందుకు సైతం ఒప్పుకోలేదు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాదాన్యత సంతరించుకుంది. తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నందున విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ను సరిచేసే వరకు నీటి వివాద అంశాలపై నోటీసులు లేదా మధ్యంతర ఉపశమనం ఉండదని స్పష్టం చేసింది.
పిటిషన్ను సరిదిద్ది, సరైన పద్ధతిలో తిరిగి దాఖలు చేసిన తర్వాతే కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్, నీటి పంపిణీ , బనకచర్ల అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, దానిని విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడానికి లేదా తెలంగాణ కోరినట్లుగా ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది.
విచారణ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని , మధ్యంతర నిషేధాజ్ఞలుజారీ చేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషన్లో 15 మంది ప్రతివాదులు ఉన్నారని కూడా న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే వరకు విచారణ చేపట్టలేమని ధర్మాసనం గమనించింది. లోపాలను సరిదిద్దే వరకు నోటీసులు జారీ చేయడం గానీ, కేసును విచారించడం గానీ సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషన్ను సరిదిద్ది, సరైన పద్ధతిలో తిరిగి దాఖలు చేసిన తర్వాతే కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.



















