అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఉత్తరాంద్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్ళలో రూ.2 వేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం నారా చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని అన్నారు.
కీలకమైన 11 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమవుతందని అన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకు రావడంతో పాటు, కరువు ప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు నిమ్మల రామానాయుడు .వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్ లో చేర్చుతూ నోటిఫికేషన్ ఇవ్వడంలో చంద్రబాబు కృషి ఫలించిందన్నారు . కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తో శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగి పోయాయని చెప్పారు. గత 5ఏళ్ళ వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయ లేదని ఆరోపించారు మంత్రి. చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంద్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను సైతం జగన్ నిలిపేశాడని సంచలన ఆరోపణలు చేశారు.















