Prataprao Jadhav : ఢిల్లీ – ఆయుష్ వైద్యం అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ (Prataprao Jadhav). సంప్రదాయ వైద్యాల బలోపేతానికి కేంద్ర ప్రభుతం తీసుకొన్న చర్యలేంటి అంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించారు తిరుపతి ఎంపి గురుమూర్తి. ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, హోమియోపతి వంటి సంప్రదాయ ఆయుష్ వైద్య (Aayushmaan) విధానాలను దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు. సంప్రదాయ వైద్యాలను ఆధునిక వైద్యంతో కలిపి వాడటం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఈ రెండు విధానాలను సమన్వయం చేయడానికి క్లినికల్ ట్రయల్స్, శాస్త్రీయ పరిశోధనలు, విభిన్న వైద్య రంగాల మధ్య సమన్వయం, సహకారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, శాస్త్రీయ ఆధారాల లోపం వల్ల ఆయుష్కు విశ్వసనీయత పొందడంలో అడ్డంకిగా మారిందా అని పేర్కొన్నారు.
Union Minister Prataprao Jadhav Key Comments
గత ఐదేళ్లలో ఆయుష్ పరిశోధన, క్లినికల్ పరీక్షల కోసం కేటాయించిన నిధులు ఏమేరకు కేటాయించారో చెప్పాలన్నారు ఎంపీ మద్దెల గురుమూర్తి. ఆయుష్ వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య (Aayushmaan) కేంద్రాల స్థాపన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాల ఏర్పాటు, పాత ఆయుష్ ఆసుపత్రుల అభివృద్ధి తోపాటు కొత్త ఆయుష్ డిస్పెన్సరీల నిర్మాణం చేపట్టామని వెల్లడించార. అలాగే 10,30,50 బెడ్లతో ఆయుష్ ఆసుపత్రుల స్థాపన, అవసరమైన మందుల సరఫరా, ప్రజారోగ్య కార్యక్రమాలు, ఆయుష్ విద్యా సంస్థల నిర్మాణం వంటి పనులు చేపడుతోందన్నారు. భారత ప్రభుత్వం ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. వాటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రోత్సహిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ సాంప్రదాయ వైద్య కేంద్రాన్ని జాంనగర్ లో స్థాపించిందన్నారు.
అంతర్జాతీయ సహకార పథకం ద్వారా విదేశాల్లో ఆయుష్కు ప్రమోషన్, ఉత్పత్తుల ఎగుమతులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇప్పటివరకు 25 దేశాలలోని 15 ఆయుష్ అధ్యాపక స్థానాలతో, 52 ఆయుష్ సంస్థల మధ్య ఒప్పందాలు చేసుకున్నారని తెలియజేశారు. ఆయుష్ యొక్క పరిశోధనా మండళ్లు కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధనా మండలి, కేంద్ర యునానీ వైద్య పరిశోధనా మండలి, కేంద్ర హోమియోపతి పరిశోధనా మండలి, కేంద్ర సిద్ధ వైద్య పరిశోధనా మండలి దేశంలోని ప్రముఖ వైద్య, శాస్త్రీయ సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని స్పష్టం చేశారు. ఎయిమ్స్, నిమ్హాన్స్, ఐఎల్బిఎస్, ఎసిటిఆర్ఈసి, ఐఐటీలు వంటి సంస్థలతో కలిసి సమగ్ర వైద్య విధానాలపై పరిశోధన జరుపుతున్నట్లు తెలియజేసారు. ఆయుష్ విధానాలు శాస్త్రీయ ఆధారాలతో నడుస్తున్నాయని, ఈ పరిశోధనల వివరాలు ఆయుష్ రీసెర్చ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : KTB Chief Gantla Srinubabu Interesting : రక్షణ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
