అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ఈ సి ఆర్ ఎఫ్ గ్యాప్ 1,2 ల్లో జరుగుతున్న వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం.. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేసేందుకు వేగం పెంచాలని సూచించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురామ్, జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ కె. నరసింహమూర్తి, పర్యవేక్షక ఇంజినీర్ పి. రామచంద్రరావు తదితరులు బృందంలో ఉన్నారు. నిర్మాణ ప్రాంతంలో వివిధ విభాగాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ సంస్థ ఏం ఈ ఐ ఎల్ , జలవనరుల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పీపీఏ దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం కోసం పీపీఏతో సంప్రదిస్తూ సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. పనుల వేగానికి ఆటంకం కలిగించే అంశాలను ముందుగానే గుర్తించి పరిష్కరించు కోవాలని స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి.
జలవనరుల శాఖ ఈఈలు కే బాలకృష్ణ, బి దామోదర్, డి శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు పీపీఏ బృందానికి ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు. ఆయా నిర్మాణ ప్రాంతాల్లో జరుగుతున్న పనులు, వాటి ప్రస్తుత స్థితి, మున్ముందు చేపట్టాల్సిన పనులపై వివరాలు అందించారు.

















