హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదలపై నిప్పులు చెరిగింది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన నువ్వు ఎక్కడ అమలు చేశావో చెప్పాలని నిలదీసింది. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే లేదని ఇక తెలంగాణకు వచ్చి ఏం ఉద్దరిస్తావో చెప్పాలని ప్రశ్నించింది. తాము జనసేన పార్టీ (జేఎస్పీ)ని అగ్రవర్ణ ఆధిపత్య పార్టీగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది.
పవన్ కళ్యాణ్కు భారత రాజ్యాంగ ప్రతిని విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నామని తెలిపింది. కనీసం ఇకపై తన జనసేన పార్టీలో సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేయాలని సూచిస్తున్నాం అని పేర్కొంది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. లోక్ సభ స్థానాలకు సంబంధించి ఉన్న వారిలో ఉదయ శ్రీనివాస్ (కాపు ఓసీ), బాలశౌరి (కాపు ఓసీ), లింగనేని రమేష్ (కమ్మ ఓసీ) ఉన్నారని తెలిపింది. ఇక కేబినెట్ విషయానికి వస్తే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కాపు (ఓసీ), కందుల దుర్గేష్ (కాపు – ఓసీ ) నాదెండ్ల మనోహర్ (కమ్మ – ఓసీ ) ఉన్నారని ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలు ఎందుకు లేరని ప్రశ్నించింది.
పార్టీ అగ్ర నాయకత్వంలో..ఎన్నికైన పదవులలో…బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇతర అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఎక్కడ ఉందో చెప్పాలని పవన్ కళ్యాణ్ ను నిలదీసింది. బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక న్యాయం కేవలం ప్రసంగాలలోనే కాదని, రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా ప్రతిబింబించాలని స్పష్టం చేసింది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్.
