హైదరాబాద్ : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి లభ్యత, పంపిణీకి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇవాళ తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసి) సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి అధ్యక్షత వహించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా గృహ వినియోగ ఎల్పిజి కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తగినంత సరఫరా కొనసాగుతోందని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రోజువారీ ఇంధన సరఫరాలు గణనీయంగా పెంచడం జరిగిందన్నారు జి. కిషన్ రెడ్డి. అనేక సందర్భాల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు.
తెలంగాణలో, పెట్రోల్ సరఫరా దాదాపు 6,400 కేఎల్ నుండి 10,300 కేఎల్కు పెరగగా, డీజిల్ సరఫరా దాదాపు 8,000 కేఎల్ నుండి 15,500–19,300 కేఎల్కు పెరిగిందని చెప్పారు కిషన్ రెడ్డి. ఒక్క హైదరాబాద్లోనే, పెట్రోల్ సరఫరా సుమారు 3,200 కేఎల్ నుండి దాదాపు 6,400 కేఎల్కు, డీజిల్ సరఫరా సుమారు 2,700 కేఎల్ నుండి దాదాపు 5,060 కేఎల్కు పెరిగిందన్నారు. 4,325 ఇంధన అవుట్లెట్లలో, కేవలం 106 మాత్రమే రవాణా , చెల్లింపు సంబంధిత కారణాల వల్ల తాత్కాలిక నిల్వల సమస్యలను నివేదించాయన్నారు. వీటిని ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారని తెలిపారు. చురుకైన దౌత్య సహకారంతో, రిఫైనరీల నుండి నిరంతరాయ రవాణా , దిగుమతుల ద్వారా భారతదేశం తగినంత పెట్రోలియం నిల్వలను కొనసాగిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి.
















