న్యూఢిల్లీ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో గత కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయి ఉన్న స్వచ్చంధ సంస్థల (ఎన్జీఓ)లకు అందుతున్న విదేశీ నిధుల (ఎఫ్సీఆర్ఏ) మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ సర్కార్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వాటిని తక్షణమే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు కేసీ వేణుగోపాల్ . దీని వల్ల ఇప్పటికే సేవలు అందిస్తున్న వాటికి నిధులు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిబంధనలు స్వతంత్ర ఎన్జీఓలను “భయభ్రాంతులకు గురయ్యే, ప్రభుత్వ నియంత్రిత ప్రతిధ్వని గది”గా మార్చే “చివరి మేకు” అని వేణుగోపాల్ ఆరోపించారు. తమ పార్టీ బేషరతుగా ఈ నిర్ణయాన్ని, కఠినతరమైన నిబంధనలను విధించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఖండిస్తుందని పేర్కొన్నారు .అంతే కాకుండా అనుమతించబడిన భౌగోళిక ప్రాంతం వెలుపల పని చేసినందుకు భారీ జరిమానాలు విధించడం కూడా కక్ష సాధింపు అని మండిపడ్డారు. సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లు, ప్రచురణలను తప్పనిసరిగా బహిర్గతం చేయడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా దేశానికి స్వేచ్ఛ లభించనప్పటి నుంచి కూడా స్వచ్చంధ సేవలు విశిష్ట సేవలు అందిస్తున్నాయని తెలిపారు కేసీ వేణుగోపాల్. విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక చైతన్యం, బాల కార్మికుల నిర్మూలన, జోగిని వ్యవస్థ, ఉమెన్ ఎంపవర్మెంట్ , తదితర అంశాలపై కృషి చేస్తున్నాయి.


















