హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే రామగుండంలో కొత్తగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తక్కువ ధరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నుంచి విద్యుత్ తీసుకోకుండా కమిషన్ల కోసం కాకుండా రామగుండంలో ప్లాంట్ పెట్టి సొంతగా విద్యుత్ తయారు చేస్తామని అంటున్నారని ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు హరీశ్ రావు. ఇదిలా ఉండగా ఒక యూనిట్ విద్యుత్ మీద అదనంగా రూ.3 ఖర్చు పెడితే రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పతి అవుతుందని చెప్పారు.
ఎన్టీపీసీ నుండి విద్యుత్ తీసుకోకుండా రామగుండం ప్లాంట్ నిర్మించి విద్యుత్ తీసుకుంటే తెలంగాణ ప్రజల మీద రోజుకు రూ.9 కోట్లు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రూ.3285 వేల కోట్లు అదనపు భారం అవుతుందన్నారు. రామగుండం ప్లాంట్ కు 25 ఏళ్లు అగ్రిమెంట్ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజల మీద రూ.82 వేల కోట్ల భారం పడనుందని వాపోయారు తన్నీరు హరీశ్ రావు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ సర్కార్ 30 శాతం కమీషన్ల కోసమే థర్మల్ ప్లాంట్ కు ప్లాన్ చేశారని సంచలన కామెంట్స్ చేశారు. మొత్తం రూ. 50 వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారని పేర్కొన్నారు. సర్కార్ నిర్వాకం కారణంగా ప్రజలపై ఏకంగా ర. 82 వేల కోట్ల భారం పడుతుందన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
