అమరావతి : ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు.
సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని చెప్పారు నారా లోకేష్ . ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
