హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ) నిలిచే ఉంటారని ప్రశంసించారు , ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శిల్పకళా వేదికగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు కుటుంబ సమేతంగా. తనే ఓ చరిత్రగా మారి పోయిన మహానుభావుడు అని పేర్కొన్నారు. చరిత్ర కర్తగా నిలిచిన తను తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడని ప్రశంసించారు చిరంజీవి.
ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదని ఓ అద్భుతమైన శక్తి అని పేర్కొన్నారు. N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం అన్నారు. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడని కొనియాడారు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియక పోయినా ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ నైపుణ్యం కలిగిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
రామారావు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించ లేనిదన్నారు.
అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్బంగా తనను గుర్తించడమే కాకుండా గౌరవించినందుకు రాష్ట్ర సర్కార్ కు, మిత్రుడు, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
