హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల తెలంగాణ ప్రాంతం పట్ల నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆయన చేసిన కామెంట్స్ తమ మనోభావాలను పూర్తిగా దెబ్బ తీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నుంచీ తెలంగాణ పట్ల విద్వేషం వెదజల్లుతూ వచ్చాడని పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆంధ్రోళ్ల పెత్తనానికి వ్యతిరేకంగా అని ఆ విషయం తెలుసుకుని మసులుకుంటే మంచిదని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. పవర్ కోసం ఆంధ్రా పాట పాడటం, ఆస్తుల సంరక్షణ కోసం హైదరాబాద్ జపం చేయడం పవన్ కళ్యాణ్ కు తగదని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. ఇకనైనా తన పదవికి వన్నె తెచ్చేలా తాను ప్రవర్తించాలని సూచించారు. లేక పోతే తనను ఇప్పటికే జోకర్ గా భావిస్తున్నారని, సారీ చెప్పక పోతే తాము కూడా అలాగే భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.
