హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తాజాగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురించి నోరు జారడం పట్ల తీవ్రంగా స్పందించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత నితిన్ నబిన్ జీని ఎగతాళి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించిన తీవ్రమైన అహంకారాన్ని తాను ఖండిస్తున్నాని అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి చౌకబారు కామెంట్స్ వల్ల మీరు ప్రజల్లో మరింత చులకన అవుతారని గుర్తు పెట్టుకోవాలన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. .
ఆయన పేరు మీకు గుర్తులేనట్లు మీరు నటించవచ్చు, కానీ ప్రజలు మీ పేరును ఎలాంటి నటన లేకుండానే మర్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. చరిత్రలో , ప్రత్యేకించి ప్రజా స్వామ్యంలో ఎవరు ఎప్పుడు ఉంటారో , ఎవరికి ఎప్పుడు ప్రజలు అధికారం కట్టబెడతారో తెలియదన్నారు. అధికార మదంతో ఉన్న నాయకులు తరచుగా అహంకారాన్ని బలంగానూ, ఎగతాళిని రాజకీయ చతురతగానూ పొరబడుతుంటారని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు పశ్చిమ బెంగాల్లో పట్టినంత సమయం పడుతుందని మీరు భావిస్తుంటే, మరోసారి ఆలోచించాలని అన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును చూస్తుంటే, అంత సమయం పట్టకపోవచ్చు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు బీజేపీని తక్కువ అంచనా వేస్తూనే ఉండవచ్చు. కానీ, మీకంటే ఎంతో పెద్ద ప్రభుత్వాలను, మీకంటే ఎంతో శక్తివంతమైన నాయకులను మేము ఓడించామన్న సంగతి మరిచి పోవద్దని హితవు పలికారు.
