Minister Atchannaidu : అమరావతి – ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని సామున్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది ఖరీప్ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు. వాటిలో యూరియా 6.22 లక్షల మెట్రిక్ న్నులు, డి.ఏ.పి- 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి- 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 6.30 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్నారు.
Minister Atchannaidu Key Comments on Fertilizers
కేంద్రం నుండి ఆగస్ట్ నెలకు సంబంధించి రావల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీ మంత్రికి తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభ నిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందచేశామన్నారు.
అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వెంటనే గుర్తించి ఆయా ప్రాంతాలకు మార్క్ ఫెడ్ గోదాములలో నిల్వలు ఉన్నటువంటి ఎరువులను త్వరితగతిన జిల్లాలలోని సహకార సంస్థలకు పంపాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ థరలకు యూరియాను, డీఏపీని అమ్ముకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలన్నారు.
Also Read : YS Sharmila Strong Warning : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం
