హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. సీఎం ఎ . రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర సమాచార, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందాల్సిన వసరం లేదన్నారు. ప్రధానంగా ఇండ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జర్నలిస్టుల సంఘాల నేతలు సూచించిన మేరకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు మంత్రి. ఇందుకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ఇంటి స్థలాలు సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ (JNJHS) డైరెక్టర్లు, ముఖ్య ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా JNJ సొసైటీ డైరెక్టర్లు ప్రస్తావించిన అంశాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా, సంతృప్తికారంగా సమాధానాలు ఇచ్చి సమస్యను ఒక కొలిక్కి తీసుకుని వచ్చారు. మీకు స్థలాలు ఇస్తాం, మళ్లీ మీకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది అని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి. మీరంతా ఊహించని రీతిలో మీకు ప్రజాపాలన ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేస్తుందని మరోసారి మాట ఇచ్చారు. ఈ మేరకు JNJ సొసైటీ డైరెక్టర్లు, ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


















