శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న ఎస్పీ

hellotelugu-TTDSecurity

తిరుప‌తి : శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026 సందర్భంగా తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ, టీటీడీ ,విజిలెన్స్ విభాగాల సమన్వయంతో విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మఠాలు, గెస్ట్‌హౌస్‌లు, వివిధ వాణిజ్య సంస్థలు , ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్లలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సమగ్రంగా పరిశీలించే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ పరిశీలనలో భాగంగా ఇప్పటికే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న పాత వర్కర్ల వివరాలు, డేటాను పరిశీలిస్తున్నారు.ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన వర్కర్ల వివరాలను సంబంధిత సంస్థలు నమోదు చేశారా లేదా తనిఖీ చేస్తున్నారు. తాత్కాలిక శానిటరీ, గార్డెన్ వర్కర్లు, రోడ్ , బిల్డింగ్ వర్కర్లు తదితర కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు.

-ప్రతి వర్కర్‌కు సంబంధించిన వ్యక్తిగత, గుర్తింపు వివరాలతో పాటు పోలీస్ రికార్డుల ఆధారంగా యాంటీసిడెంట్‌లను పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉన్నదా అనే అంశాన్ని పోలీస్ రికార్డుల ఆధారంగా ధృవీకరిస్తున్నారు. ఆయా సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న ప్రతి వర్కర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి, పోలీస్ శాఖకు అవసరమైన సమాచారాన్ని అందించాలని స్ప‌ష్టం చేశారు ఎస్పీ సుబ్బారాయుడు . శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ యాంటీసిడెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది.

తిరుమలలోని అన్ని షాపులు, హోటళ్లు, మఠాలు, గెస్ట్‌హౌస్‌లు, వాణిజ్య సంస్థలు , ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్ల యాజమాన్యాలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి, తమ వద్ద పనిచేస్తున్న పాత , కొత్త వర్కర్ల పూర్తి వివరాలను సకాలంలో నమోదు చేసి, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భక్తుల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు ఎస్పీ.

Exit mobile version