Harish Rao : హైదరాబాద్ : మంత్రి హరీశ్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు.
హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు హరీష్ రావుని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు. జోర్డాన్లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసారని బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావుకు (Harish Rao) ధన్యవాదాలు తెలిపారు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పుకొచ్చారు.
MLA Harish Rao Good Efforts
తమను తిరిగి స్వస్థలాలకు తీసుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని, జోర్డాన్లో అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కంటనీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు.
Also Read : Telangana Govt Important Update : మున్సిపాలిటీలకు తెలంగాణ సర్కార్ నజరానా
