అమరావతి : ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగిందని చెప్పారు. ఆర్టీసీ ఆధునీకరణకు కీలక నిర్ణయాలు తమ సర్కార్ తీసుకుందన్నారు.
గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని చెప్పారు. రాష్ట్రంలో దశలవారీగా ఈవీ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. తొలి దశలో 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. జూలైలో 6 డిపోలలో ఈవీ బస్సుల నిర్వహణకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.
మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయించినట్లు వెల్లడించారు. మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేవామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఈవీ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కాలుష్య నియంత్రణలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు “గోదావరి” అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామన్నారు. అన్ని ఘాట్ల వద్ద పుష్కరాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. కొత్త ఈవీ బస్సులు ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
