Gold : పండుగ సీజన్ ప్రారంభంతో విలువైన లోహాల మార్కెట్లో ఆభరణాల ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటుతున్నాయి. మంగళవారం నాటికి తులం బంగారం రూ.1.23 లక్షల మార్కును దాటగా, వెండి ధర కిలోకు రూ.1.60 లక్షల దిశగా దూసుకెళ్తోంది.
ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం (Gold) ధర రూ.2,700 పెరిగి రూ.1,23,300కు చేరుకుంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.1,22,700కు పెరిగింది. వెండి ధరలూ అదే ధోరణిలో ఉన్నాయి. కేజీ సిల్వర్ ధర రూ.7,400 పెరిగి రూ.1,57,400 చేరుకుంది.
బులియన్ నిపుణుల ప్రకారం, అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కొనసాగడం, ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొనడం, అలాగే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోవడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుంది.
Gold – అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ దూకుడు
అమెరికా రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా మారడంతో పాటు ఫ్రాన్స్, జపాన్లలోనూ తాజా పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా విలువైన లోహాల ధరలను పెంచుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 0.25 శాతం తగ్గించే అవకాశం ఉన్నదన్న అంచనాలు బులియన్ మార్కెట్లో ఊపును తెచ్చాయి.
ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 3,900 డాలర్ల మైలురాయిని దాటగా, వెండి ధర కూడా 48.75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగిన గోల్డ్ ధరలు త్వరలోనే 4,000 డాలర్లను మించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Gold Price Growth : దీపావళి జోష్: రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు
