న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రకటించింది. సీబీజీ కోసం రూ. 23, 731 కోట్లతో గోబర్ ధన్ స్కీంను అమలు చేయనున్నట్లు అధికారికంగా ఆదివారం వెల్లడించింది. కంప్రెస్డ్ బయోగాస్ (సీబీజీ) ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించింది. ఈ పథకం ఉత్పత్తిదారులకు 100 శాతం వరకు ఉత్పత్తిని కొనుగోలు చేస్తామనే హామీని, కనీసం 10 ఏళ్లపాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మూలధన సహాయాన్ని అందిస్తుంది. వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను వాణిజ్య పరంగా మరింత లాభదాయకంగా మార్చడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం , భారతదేశ దేశీయ సీబీజీ పరిశ్రమను విస్తరించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పెట్రోలియం , సహజ వాయువు మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 15 నాటి మార్గదర్శకాలలో ఈ పథకానికి సంబంధించిన సమగ్ర విధానాలను వివరించింది. 2026-27 నుండి 2035-36 వరకు అమలు కానున్న ఈ పథకం సీబీజీ ఉత్పత్తిదారులకు మరింత స్థిరమైన మార్కెట్ను కల్పించేందుకు కృషి చేస్తుంది.
‘గోబర్-ధన్’ అంటే ‘గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్’ అని అర్థం. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు , ఇతర జీవద్రవ్యరాశి వంటి సేంద్రీయ వ్యర్థాలను బయోగాస్, సీబీజీ , సేంద్రీయ ఎరువుల వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. వినియోగదారులకు సరఫరా చేయడానికి దీనిని సహజ వాయువుతో కలుపుతారు. మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం ఆరు అంశాలను కలిగి ఉంటుంది. సీబీజీ కొనుగోలు హామీ, ధరల విధానం, మూలధన సహాయం, పైప్లైన్ మౌలిక సదుపాయాలు, రుణ హామీ మద్దతు ,పర్యావరణ వ్యవస్థ , ఛాలెంజ్ ఫండ్. భారతదేశ సీబీజీ పరిశ్రమ విస్తరణకు అడ్డంకిగా ఉన్న కీలక సమస్యలను, ముఖ్యంగా దీర్ఘకాలిక కొనుగోలుదారులు, ప్రాజెక్ట్ ఆదాయాలకు సంబంధించిన అనిశ్చితిని పరిష్కరించే దిశగా ఈ చర్య తీసుకున్నారు.
దేశీయ సీబీజీ ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడం , ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విస్తృత పథకం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం, అర్హతగల సీబీజీ ఉత్పత్తిదారులు, సాంకేతిక, కార్యాచరణ సాధ్యతకు లోబడి, అమ్మకానికి అందుబాటులో ఉన్న సీబబీజీలో 100 శాతం వరకు హామీతో కూడిన కొనుగోలును ఎంచుకోవచ్చు. ఈ గ్యాస్ను సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు , భౌగోళిక ప్రాంతాలకు గానీ, లేదా గుర్తించిన సీబీజీ క్లస్టర్లకు గానీ కేటాయించి, సమీకరించి ప్రధాన పైప్లైన్లలోకి పంపిస్తారు.
