KTR : హైదరాబాద్ : హైడ్రా పేరుతో పేదలు, సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కారణంగా నిరాశ్రయులైన బాధితులు కూడా హాజరయ్యారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వీరు నిదర్శనం అన్నారు. మూసీ వల్ల, హైడ్రా వల్ల ఎంతో మంది బాధితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా పరీక్షలు రాస్తున్నప్పటికీ పట్టించు కోకుండా చాంద్రాయణగుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారని వాపోయారు కేటీఆర్. కేసీఆర్ హయంలో ఎక్కడ చూసిన కట్టడాలే కనిపిస్తాయని అన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని చెప్పారు . వైట్ హౌస్ను తలదన్నేలా సచివాలయం కట్టామన్నారు. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నామని తెలిపారు.
KTR Slams Hydraa
హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టుకున్నాం, నీటి ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు. ఒకటీ రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేసుకున్నాం అన్నారు. కానీ ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం కట్టిన పాపాన పోలేదన్నారు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అంటే కూలగొట్టడమేనని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఈ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారడం దారుణమన్నారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుందంటూ జోష్యం చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. ఎవ్వరూ కూడా ఇంత అన్యాయంగా, కిరాతకంగా పని చేయాలని కోరుకోరన్నారు.
Also Read : Hydraa Important Update : నిజాయతీ అందరి జీవన విధానం కావాలి
