KTR : హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). యూరియా అడిగితే రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ఇదేనా రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కీ దుకాణ్ అని నిలదీశారు. జీఎస్టీ పేరుతో 8 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు దోచుకున్నందుకు పండుగ చేసుకోవాలా? దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కోసమే మేడిగడ్డను రేవంత్ రెడ్డి పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కరీంనగర్కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు.
KTR Slams Congress and BJP
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమన్నారు. ఇక జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ. 15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోడీ, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు.
రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం అన్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. ఈ దాష్టికాన్ని తాము వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు. మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Also Read : Rupee Growth : డాలర్ ఎదుట రూపాయి రికార్డు కనిష్టం దరిదాపుల్లో – 2 పైసలు కోలుకుంది
