అమరావతి : ఏపీ సర్కార్ పై సీరియస్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అరటి సాగు చేసిన రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. హలో ఇండియా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి అంటూ సీఎంను ఉద్దేశించి పేర్కొన్నారు. ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే మార్కెట్ లో అమ్ముతున్నారని , దీని వల్ల ఒక్క వస్తువు కూడా రాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి అని, ఇప్పటి వరకు వారి గురించి కనీసం ఆలోచించక పోవడం దారుణమన్నారు జగన్ రెడ్డి.
ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయం తప్పా మరోటి కాదన్నారు. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు.. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా కల్పించలేదని వాపోయారు జగన్ మోహన్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యిందన్నారు.
తమ పాలనలో టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందన్నారు. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించామన్నారు. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నామని చె్ప్పారు. ఇవాళ వ్యవసాయం కూలిపోతుంటే, రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
