హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ స్మృత్యర్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల (2025) ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ అవార్డుల విజేతల జాబితాను జ్యూరీ సభ్యులు మల్లుకు అందజేశారు. తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచి ఈ అవార్డులకు ఎంపికైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
నిష్పక్షపాతంగా ఉత్తమ చిత్రాలను, ప్రతిభావంతులను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ అస్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రతిబింబించేలా ఈ అవార్డులు భవిష్యత్తులో మరెందరో కొత్త కళాకారులకు స్ఫూర్తిని ఇస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. సామాజిక బాధ్యతతో కూడిన సృజనాత్మకతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
