CM Revanth Reddy : హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) సోమవారం పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను నగర జంట జలాశయాలకు తరలించేందుకు సీఎం రేవంత్ శ్రీకారం చుడతారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఈ నెల 8న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-II & III పథకానికి శంకుస్థాపన చేస్తారు.
CM Revanth Reddy New Projects
రూ.7,360 కోట్లతో హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్. ఇందులో 40 శాతం ప్రభుత్వం పెట్టుబడి పెడుతుండగా, 60 శాతం కాంట్రాక్ట్ కంపెనీ నిధులు సమకూర్చనుంది. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్-ఫేజ్ IIలో భాగంగా జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయితీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మాణం జరగనుంది.
కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి-నియో పోలీస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారని సీఎంఓ తెలిపింది. రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులతో దాదాపు 13 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
Also Read : Botsa Satyanarayana Fired on Goa Governor : గోవా గవర్నర్ కామెంట్స్ బొత్స సీరియస్
