అమరావతి : ఏపీలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నామని అన్నారు ఏపీ రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత. విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో ఈగల్ (EAGLE – Elite Anti-Narcotics Group for Law Enforcement) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా అనిత వంగలపూడి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు అధికారులు ,ఇతర ప్రముఖులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. యువతను మాదకద్రవ్యాల వ్యసనం అనే ప్రమాదం నుండి రక్షించాల్సిన అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు. మాదకద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పని, ఇది యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలను ప్రశంసిస్తూ, రాష్ట్రం సాధించిన “జీరో గంజాయి సాగు” విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్రమ గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ల నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ, ముఖ్యంగా ఈగల్ బృందాలు నిరంతరం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగ చరిత్రను ప్రస్తావిస్తూ 1980ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య వేగంగా విస్తరించిందని అన్నారు.
అప్పటి నుండి సమాజాలకు పెద్ద సవాలుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ, అసంప్రదాయ నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బ తీస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటిగా, గత మూడు నుండి నాలుగు దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతాలు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్న అక్రమ గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, ఈ ఘనతకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ , ఈగల్ బృందాల అంకితభావమే కారణమని కొనియాడారు.
