అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకు రావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు.
ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం, గ్యాస్ కొరత కొనసాగుతోంది. పశ్చిమాశియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల దృష్ట్యా తీవ్ర ప్రభావం కొనసాగుతోంది. భారీ ఎత్తున ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దని, ఇంధనం పొదుపు గా వాడాలని కోరారు. దీంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్ప కూలింది. దాదాపు రూ. 7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని సూచనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
