CM Chandrababu : అమరావతి : ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత ఏ విధంగా ఉంది, సరఫరా ఎలా జరుగుతోందనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని అధికారులు వివరించారు. అవసరానికి తగ్గట్టుగానే ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంతమేర ఎరువులను సరఫరా చేస్తున్నారని చంద్రబాబు అడిగారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
CM Chandrababu Key Comments
మార్క్ ఫెడ్ ద్వారా దాదాపు 70 శాతం మేర ఎరువులు రైతులకు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని సీఎం సూచించారు. భారీ స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పాటు యూరియా, ఎరువుల స్టాక్ కూడా చెక్ చేయాలని అన్నారు. అలాగే వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలి పోకుండా కట్టడి చేయాలని సూచించారు. అలాగే ఎరువుల సక్రమ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని, ఇదే సందర్భంలో ఎరువులు, యూరియా సరఫరా విషయంలో జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు.
పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలని, అదే సమయంలో ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే, అలాంటి వారిని పసిగట్టి… తగు రీతిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎరువులు, యూరియా లభ్యత విషయంలో రైతులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని చెప్పారు.
Also Read : CM Revanth Reddy Important Meet : సీఎంను కలిసిన దర్శకులు, నిర్మాతలు
