అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు జగన్ రెడ్డిపై. ఆయన తన పాలనా కాలంలో ఏపీని అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే బురద జల్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప ఏమీ చేతకాదని మండిపడ్డారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. అసత్యాన్ని పదేపదే చెబితే ప్రజలు విశ్వసిస్తారని కొందరు అనుకుంటున్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకానికి టీడీపీ ఓ బ్రాండ్. ఎన్నికల్లో ప్రకటించి అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి అత్యంత కట్టుదిట్టంగా నియామకాలు చేపట్టాం అని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అంటున్నారు. కానీ వారికి క్రీడల్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయని చెప్పారు సీఎం. వాళ్ల పేటిఎం బ్యాచ్ ల ద్వారా లేని పోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొందరు చేస్తున్న దద్దమ్మ పనులకు ప్రజలు ఇబ్బందులు పడాలా…? పారదర్శకంగా చేసిన నియామకాలపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి ఆ తర్వాతే మాట్లాడాలని అన్నారు. సాక్ష్యాలు, నిజాలతో అసెంబ్లీలో గట్టిగా పోరాడిన ఘటనలు ఉన్నాయని అన్నారు. కొందరు ఏదేదో మాట్లాడేసి బురద చల్లుతామంటే ఎవరు విశ్వసిస్తారు..? యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించాం అని వెల్లడించారు సీఎం దీనిపైనా విమర్శలు చేయటం ఏమిటి..? ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వాపోయారు. దీనికి ప్రజల్లో చైతన్యం తీసుకు రావటం తప్ప మరోమార్గం లేదని అని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.
