సికింద్రాబాద్ : బోనాల ఉత్సవం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ లోని ప్రముఖ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయం వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డి. సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అమ్మ వారికి పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మ వారిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రజా ప్రభుత్వాన్ని చల్లంగా దీవించాలని , రాష్ట్రంలో ప్రజలు సుఖ, శాంతులతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ ఉండాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.



















