అమరావతి : ఎక్కడ చూసినా క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బిజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి. గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పురుగులు లేని , ఉపయోగించని వ్యవసాయం సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ పండించే రైతులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సంవత్సరాలుగా రసాయన ఎరువులు, పురుగు మందులపై అధికంగా ఆధార పడటం వల్ల సాగు ఖర్చులు పెరిగాయని, నేల సారవంతం తగ్గిందని పేర్కొన్నారు. దీని కారణంగా ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అన్నారు.
రైతుల జీవనోపాధికి, నేల ఆరోగ్యానికి, ఆహార భద్రతకు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. దీనిని పరిష్కరించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్త ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పరమ పరాగత్ కృషి వికాస్ యోజన, భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వంటి పథకాల ద్వారా కేంద్రం రసాయన రహిత సాగుకు మద్దతు ఇస్తోందని కుమార స్వామి చెప్పారు. ఈ పథకాలు శిక్షణ, ధృవీకరణ, మార్కెట్ అనుసంధానం, సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన ధరలను అందిస్తాయని ఆయన అన్నారు.
















