తిరుపతి : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎన్సిసి క్యాడెట్లు, టీటీడీ నిఘా , భద్రతా , అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్నల్ అనూప్ మీనన్ ఆధ్వర్యంలో గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్, రాణి, తేజ్, గ్లోరి అనే అశ్వాలతో ఎన్సిసి క్యాడెట్లు పలు సాహస విన్యాసాలను ప్రదర్శించారు. తొలుత జాతీయ జెండా, ఎన్సిసి జెండా, టీటీడీ జెండాలను ప్రదర్శించిన క్యాడెట్లు, అనంతరం టెంట్ పెగ్గింగ్, షో జంపింగ్, ఇండియన్ ఫైల్ తదితర విన్యాసాలను చక్కటి సమన్వయంతో నిర్వహించారు. అశ్వాలపై పరేడ్ మైదానం చుట్టూ తిరుగుతూ క్యాడెట్లు చేసిన సాహస విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
టీటీడీ నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది. విరాట్, బ్యూటీ, ఫైని, రాణి, సిరి, జ్యోలా, బిందు అనే జాగిలాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు పుష్పగుచ్ఛం అందించి గౌరవ వందనం చేయడం, గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడటం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం వంటి పలు విన్యాసాలను జాగిలాలు ప్రదర్శించాయి.
ఏడీఎఫ్ఓ అనిల్కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వివిధ విన్యాసాల ద్వారా అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణపై అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ కారణంగా సంభవించే మంటలను ఎలా అదుపు చేయాలి, ముఖ్యంగా ఇంట్లో వంట చేస్తున్నసమయంలో గ్యాస్ సిలిండర్కు మంటలు వ్యాపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి తదితర అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు.



















