AP Govt : వ్యవసాయ రంగం ప్రధానాధారంగా ఉన్న భారత్లో, గ్రామీణ రైతుల జీవనాధారం వ్యవసాయమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పలు ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాయితీ ధరలకు గడ్డి విత్తనాలు, దాణా, వ్యాక్సిన్లు, అలాగే నట్టల నివారణ మందులు పంపిణీ జరుగుతోంది.
AP Govt – గడ్డి విత్తనాలపై 75% రాయితీ
పాడిరైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందిస్తోంది. సాధారణ మార్కెట్లో ధర రూ.465 ఉన్న 5 కిలోల గడ్డి విత్తనాల సంచిని, రైతులకు కేవలం రూ.115 కే ఇవ్వనున్నారు. అదనంగా, దాణా పైనా 50 శాతం రాయితీ అందుబాటులో ఉంటుంది.
ఈ రాయితీల కోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీలు కలిగి ఉండాలి. అవసరమైన కాగితాలతో పశువైద్య ఆస్పత్రుల్లో వైద్యులను లేదా రైతు సేవా కేంద్రాల్లో ఏహెచ్ఏలను సంప్రదించాల్సి ఉంటుంది.
నట్టల నివారణ కోసం ఉచిత మందులు
గొర్రెలు, మేకల కోసం నట్టల నివారణ మందులు కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి. ఈ మందులు ప్రైవేట్ మార్కెట్లో రూ.600 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుండగా, ప్రభుత్వం ఉచితంగా ఇవి అందించడం రైతులకు ఉపశమనం కలిగిస్తోంది.
దాణాపై రాయితీ
పోషకాలతో కూడిన 50 కిలోల దాణా సంచి మార్కెట్లో సుమారు రూ.1100 వరకు ధర ఉండగా, ప్రభుత్వం రూ.550 కే అందిస్తోంది. ఇది 50 శాతం రాయితీ కింద కల్పించబడుతోంది.
రాయితీపై గడ్డి కోత యంత్రాలు త్వరలో
రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ధరకు గడ్డి కోత యంత్రాలు కూడా త్వరలోనే అందించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉత్పాదకత పెంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Also Read : KTR Shocking Comments : సింగూరు డ్యామ్ కు పొంచి ఉన్న ముప్పు
