హైదరాబాద్ : దండోరా మూవీ ఈవెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు శివాజీ. మహిళల వస్త్రధారణపై స్పందించాడు. తన మనసులోని మాటలను బయట పెట్టాడు. స్త్రీలు నిండుగా చీరలు ధరిస్తే బావుంటుందని, కానీ పొట్టి దుస్తులు వేసు కోవడం వల్ల ఎలాంటి ఫాయిదా ఉండదన్నారు. వారి శరీరాల వస్త్ర ధారణపై దారుణంగా మాట్లాడారంటూ ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాదతో పాటు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ భగ్గుమన్నారు. చివరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యాడు. ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు. దీంతో గత్యంతరం లేక తాను దిగి వచ్చాడు. ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను కావాలని అనలేదని, మహిళలంటే తనకు గౌరవం ఉందన్నాడు. ఆపై తాను చేసిన మాటలకు కట్టుబడి ఉన్నానని, మనసు నొచ్చుకుంటే మన్నించాలని కోరాడు శివాజీ.
దీనిపై తీవ్రంగా స్పందించింది తెలంగాణ మహిళా కమిషన్. ఈ మేరకు శివాజీకి నోటీసు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో మనోడు శనివారం కమిషన్ ముందు హాజరయ్యాడు. తాను దురుద్దేశ పూర్వకంగా మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని విచారణలో చెప్పాడు. అయితే ఇప్పటికే తాను క్షమాపణ చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేశానని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముందు వెల్లడించాడు. తన ముందు తప్పైందని, మన్నించాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు కొణిదల. మరోవైపు, శివాజీ వాడిన పదాలు తప్పైనా, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదేనని కొందరు సమర్థించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
