UPI : దేశవ్యాప్తంగా యూపీఐ (యునైఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలు రోజురోజుకీ విస్తరిస్తున్న తరుణంలో, ప్రముఖ బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించాయి. ఇప్పటికే యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మార్గాన్ని అనుసరించగా, తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది.
UPI Charges Update
ఆగస్టు 2వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వ్యాపారుల యూపీఐ (UPI) లావాదేవీలను నిర్వహించేందుకు చెల్లింపు అగ్రిగేటర్లపై రుసుం విధిస్తోంది. ఈ రుసుం వ్యవస్థ ప్రకారం, ఎస్క్రో ఖాతా కలిగిన అగ్రిగేటర్లకు ప్రతి లావాదేవీపై 2 బేసిస్ పాయింట్ల (రూ.100కి రూ.2) రుసుము వర్తిస్తుంది. ఇది గరిష్ఠంగా రూ.6 వరకు పరిమితమవుతుంది.
ఇక ఎస్క్రో ఖాతా లేని చెల్లింపు అగ్రిగేటర్లపై 4 బేసిస్ పాయింట్ల రుసుం (రూ.100కి రూ.4) విధించబడుతోంది. ఈ రుసుము గరిష్ఠంగా రూ.10 వరకు ఉంటుంది. అయితే, వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్లో ఖాతా కలిగి ఉండి, లావాదేవీల సెటిల్మెంట్ ఆ ఖాతాలోనే జరిగితే, వారిపై ఈ రుసుములు వర్తించవు.
ప్రస్తుతం Paytm, Google Pay, PhonePe వంటి ప్రముఖ చెల్లింపు అగ్రిగేటర్లు ఈ ఛార్జీలను భరిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఈ ఖర్చు వినియోగదారులపై పడే అవకాశాలు లేకపోలేదు.
జూలై నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,947 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దీని విలువ రూ. 25 లక్షల కోట్లను దాటింది. రోజుకు సగటున 70 కోట్ల లావాదేవీలు నమోదవుతున్నాయి. ఇటువంటి విస్తృత లావాదేవీలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే NPCI ద్వారా యూపీఐ స్విచ్ సౌకర్యం పొందడం వంటి అంశాలపై ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు తమ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ విధంగా ఛార్జీల విధింపుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
ఇక చెల్లింపు అగ్రిగేటర్లు ఈ అదనపు భారాన్ని ఎలా ఎదుర్కొంటారు? వినియోగదారులకు దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్నదాన్ని సమయం తేల్చాలి.
Also Read : India UK FTA Growth : భారత్ నుంచి బ్రిటన్ కు భారీ మొత్తంలో మత్స్య ఎగుమతులు


















